విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.

 


*విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.*


విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. 


కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ బాసటగా నిలిచారు.


 సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్‌ అనిపించుకున్నారు.


 ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?.. 


వారిని రప్పించేందుకు అయ్యనార్‌ చేసిన ఆపరేషన్ ఏంటి?…



సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్‌ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ బాగోతాన్ని గుర్తించడమే కాదు.. మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు.



ఇక.. ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వివరాలు, వారి మోసాలపై CP రవిశంకర్‌ అయ్యానార్‌ దృష్టి సారించారు. కొందరు విశాఖ ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్‌ నిర్బంధించినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయుల వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారని.. ఇలా.. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్‌ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది.



వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. అంతేకాదు.. మనవాళ్లకు పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్‌ ఇచ్చి.. మనదేశంపైనే సైబర్‌ ఎటాక్‌ చేయిస్తుండడం సంచలనంగా మారింది.



ఇక.. కంబోడియా గ్యాంగ్‌ మన వాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు?.. మనవాళ్లతో సైబర్‌ నేరాలు ఎలా చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్‌ గుట్టు ఎలా రట్టు చేశారు?.. అనే కీలక విషయాలను వెల్లడించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో విశాఖ ఏజెంట్లు నిరుద్యోగులను కంబోడియా ఏజెంట్లకు అమ్మేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా విశాఖ ఏజెంట్లకు కంబోడియా గ్యాంగ్‌ ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు.



మొత్తంగా.. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ ఆపరేషన్ సూపర్‌ సక్సెస్‌ అయింది. కంబోడియాలోని ఇండియన్‌ ఎంబసీ సహకారంతోనే 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్‌ స్కామ్‌కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు.