*రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోండి - రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ.. లోక్ సత్తా పార్టీ, మాదాసు భాను ప్రసాద్*
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు.
చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది చనిపోయారని, ఇంకా ఎంతోమంది క్షతగాత్రులై జీవితకాలం అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు. ఆలోచిస్తే, వీటిలో ఎక్కువ శాతం నివారించదగిన రోడ్డు ప్రమాదాలే.
కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ నష్టం ఎంత మాత్రమూ భర్తీ చేయలేనిదని మరియు ఎంత నష్ట పరిహారం ఇచ్చినా, ఇన్సూరెన్స్ ఇచ్చిననూ కుటుంబంలో ఆలోటు పూడ్చలేనిదిని లేఖలు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు కనీస ప్రమాణాలను పాటించకుండా ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదు అనే విషయం జగమెరిగిన సత్యం.
ఓవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్నా, అవకాశాలను అందిపుచ్చుకోకుండా మూస ధోరణులతో అద్భుతాలు సాధించాలనుకోవడం సరి అయినది కాదన్నారు.
పట్టణంలో యదేచ్ఛగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు స్వైర విహారం చేస్తూ రోడ్లపై యాక్సిడెంట్లు చేసి పారిపోతుంటే బాధితులు ఎవరిమీద కంప్లైంట్ చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి కొనసాగుతుందన్నారు. అదేవిధంగా బుల్లెట్లకు అధిక ధ్వని నిచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు వెంబడి నడిచే స్త్రీలను, కాలేజీ విద్యార్థులను ఆకతాయి కుర్రకారు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
ఈ విధంగా ప్రమాదాలకు గురైన బాధితులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కోర్టులను ఆశ్రయించి కాళ్ళు అరిగేలా కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం కోసం పోరాడితే... విస్తుపోయే నిజాలు అనగా ఇన్సూరెన్స్ ఫోర్స్లో లేని మరియు అసలు ఇన్సూరెన్సే చేయించని వాహనాలు నడపడం వలనరోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడవుతుందన్నారు. ఇలాంటి ప్రమాద సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నప్పటికీ, పఠిష్టంగా తనిఖీలు లేకపోవడం విచారకరం. ఇది చాలదన్నట్లు ట్రిపుల్ రైడింగ్, మైనర్ ల డ్రైవింగ్ లాంటి విపరీత డ్రైవింగ్ ల నియంత్రణ కొరకు ప్రజలలో కొరవడిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో గతంలో ఆటోలకు లోకల్ నెంబర్లు జారీ చేసే సంప్రదాయం ఉండేది, తద్వారా ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్రమత్తత కలిగి ఏదైనా నేరం జరిగితే ఫిర్యాదు చేయుటకు సులభతరంగా ఉండేది అన్నారు. కానీ కొంతకాలంగా అటువంటి పరిస్థితి కొనసాగించబడుటలేదు.
పట్టణంలో గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుండి నెంబర్ ప్లేట్లు లేని ఆటోలతో వచ్చి పక్కా ప్రణాళికతో దొంగతనం చేయుటకు ఒక సహాయకుని తెచ్చుకొని, జేబులో డబ్బులు కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్ పక్కన కూర్చోబెట్టుకొని చాలా తెలివిగా జేబులలో నగదు, పర్సులను తస్కరిస్తూ, ఆడవారైతే వారి మాన ప్రాణాలను కూడా బలి తీసుకుంటూ సాక్షాలను దొరక్కుండా చేస్తున్నారని అన్నారు. వీనికి సంబంధించి, సహజంగానే స్థానికంగా నిజాయితీగా నడుపుకునే ఆటో డ్రైవర్లను అనుమానించి విచారించవలసి వస్తుందని అన్నారు. కనుక ఇప్పటికైనా స్థానికంగా ఆటోలన్నింటికీ లోకల్ నెంబర్ గనుక గతంలో మాదిరిగా ఏర్పాటు చేసినట్లయితే బయట నుంచి వచ్చే వాహనాలను గుర్తించడం సులభతరం అవుతుందని లేఖలో పేర్కొన్నారు.
కనుక, చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్, హరి ప్రసాద్, మురకొండ వెంకటరావు, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, విశ్రాంతి సీఐ నారాయణ, బాలు తదితరులు పాల్గొన్నారు..