*ప్రాణాలకు విలువ ఇవ్వండి _ మితిమీరిన వ్యక్తి పూజను ఇకనైనా ఆపండి! లోక్ సత్తా..*
విష సర్పాలను సైతం రక్షించి పచ్చిక బయలు ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టి, వాటి వలన కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ సర్పాలను సైతం చంపొద్దు అని ప్రచారం చేసే "పుణ్యభూమి"అయిన భారతదేశంలో మనిషి ప్రాణాలకు విలువే ఇవ్వలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు.
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయుటకు సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంటే, ఒక్క భారతదేశంలో మాత్రమే అయినదానికి ,కాని దానికి అభిమానం పేరిట రోడ్లెక్కించడం పరిపాటిగా మారిందని అన్నారు.
ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో నిండు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పరిస్థితి కూడా అటువంటిదేనని అన్నారు. అభిమానులు వ్యక్తి ఆరాధనతో ప్రాణాలను ఫణంగా పెడుతుంటే నాయకులు మాత్రమే ఎప్పటికప్పుడు వారి ఆస్తులను, పదవులను వారి కుటుంబ సభ్యులకు పంచుకుంటున్నారని అన్నారు. పన్నులకు తగ్గ సేవలు ఎందుకు అందటం లేదో ప్రశ్నించే పరిస్థితి నేడు ప్రజలలో లేదని అన్నారు. ప్రజలకు మాత్రం ఎప్పటికప్పుడు పన్నులను పెంచి భారం మోపుతున్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అభిమానం పేరిట చేసే ఈ మితిమీరిన వ్యక్తి పూజ ఒక వ్యసనం లాగా మారిందని ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాదని, సినిమా అభిమానుల పేరిట, క్రికెట్ అభిమానుల పేరిట, చివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అభిమానుల పేరిట కూడా రోడ్లెక్కి ప్రాణాలు కోల్పోయే దశకు ఈ వ్యక్తి పూజ చేరిందని అన్నారు. మంచి వాళ్ళ మౌనము సమాజానికి నష్టాన్ని చేకూరుస్తుందని, ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు.. ఒక విష సర్పం ప్రాణం కంటే, మనిషి ప్రాణం ఎంతో విలువైనది అనే విషయాన్ని గుర్తించే వరకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యాసంస్థల్లోనూ, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇటువంటి అవగాహన కల్పించడం సులభతరం అవుతుందని అన్నారు..