తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట

 తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట 



– మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి


యడ్లపాడు మండలంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొండవీడుకోటను మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి మంగళవారం సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు, మహాద్వారం, పిల్లల క్రీడాపార్కు, తూర్పు ద్వారము (కట్టిలదిద్ది వాకిలి), లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేమన మండపం, అనవేమారెడ్డి విగ్రహం, చారిత్రక అంశాలను వివరించే గ్యాలరీ, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల చెరువు డెక్కు ప్రాంతాలతో పాటు కొండపై ఉన్న చారిత్రక ప్రదేశాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కత్తులబావి సందర్శనకు వెళ్లగా కోటగ్రామస్తులు సాదరస్వాగతం పలికారు. కొండవీటి కైఫియత్తు ఆధారంగా 72 మంది పాలెగాండ్ల తిరుగుబాటును అణచివేసేందుకు బావిలో కత్తులు అమర్చి జరిగిన ఘోర ఘటనను కల్లి శివారెడ్డి వివరించారు. అక్కడ నుంచి హౌస్‌గణేష్‌పాడులోని అఖిలభారత రెడ్లసంక్షేమ సమాఖ్య ఏర్పాటు చేసిన కొండవీటి రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడ ఇటీవల లభ్యమైన పురాతన ఖడ్గాన్ని, రాతి ఫిరంగి గుండును తులసిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవీడుకోటను పుస్తకాల్లో తప్ప క్షేత్రస్థాయిలో చూడటం తొలిసారి అన్నారు. గ్రంథాల్లో రాసిన వాటికంటే వీటి ప్రాముఖ్యత ఎంతో గొప్పదనే అభిప్రాయం కలిగిందన్నారు. అద్దంకి నేల రాజధానిని కొండవీడు కొండలపై గిరిదుర్గంగా చేసుకుని వందేళ్లకు పైగా శతదుర్బేద్యంగా పాలించారని, కవిత్రయంలో ఎర్రప్రెగడ, కవిసార్వభౌముడు శ్రీనాధుడు, ప్రజాకవి వేమన, పెదకోమటి వేమారెడ్డి వంటి మహాపండితులకు కొండవీడు నిలయమై ఎన్నో గ్రంథాలకు జీవమిచ్చిందన్నారు. ఘాట్‌రోడ్డులు తనకు ఎంతో నచ్చాయని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పర్యాటకంగా కొండవీడును మరింత అభివద్ధి చేయాలని కోరారు. మ్యూజియంను ప్రైవేట్‌ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని, యాజమాన్యం మరిన్ని వస్తువులు మ్యూజియంలో ఏర్పాటు చేస్తే పర్యాటకులకు మరింత ఆసక్తిని కలిగించగలదని సూచించారు. ప్రదర్శనశాల వారు ‘కొండవీడు‘ అనే గ్రంథాన్ని తులసిరెడ్డికి బహుకరించారు. కార్యక్రమంలో ప్రదర్శనశాల కన్వీనర్‌ బొడపాటి అంజిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ, యడ్లపాడు, నాదెండ్ల మండలాల కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మ్యూజియం మేనేజర్‌ నారాయణరెడ్డి, ఉద్యోగులు కొండబోయిన వెంకటేశ్వరరావు, మరియమ్మ, కొండవీడుకోట కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి ఉన్నారు.